Saturday, October 24, 2009

అరుంధతి'కి అవార్డుల పంట

రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించిన నంది అవార్డులు-2008లో కోడిరామకృష్ణ దర్శకత్వంలో శ్యాంప్రసాద్ రెడ్డి నిర్మించిన 'అరుంధతి' చిత్రం 10 అవార్డులు సొంతం చేసుకుని విజయకేతనం ఎగురవేసింది. ఉత్తమ చిత్రం అవార్డును జాగర్లమూడి రాథాకృష్ణ దర్శకత్వంలో శర్వానంద్ కథానాయకుడుగా నటించిన 'గమ్యం' దక్కించుకుంది. ఈ అవార్డు కింద స్వర్ణ నంది, 50 వేల నగదు అందిస్తారు. ఈ చిత్రానికి మొత్తం 3 అవార్డులు దక్కాయి. ఉత్తమ నటుడుగా 'నేనింతే' చిత్రంలో నటనకు గాను రవితేజ ఎంపికయ్యారు. నంది అవార్డు ఆయనకు దక్కడం ఇదే ప్రథమం. ఈ చిత్రానికి మొత్తం 3 అవార్డులు వరించాయి. '1940లో ఒక గ్రామం' చిత్రానికి సైతం 3 అవార్డులు దక్కాయి.

ఉత్తమ ద్వితీయ చిత్రంగా కృష్ణుడు హీరోగా సాయి కిరణ్ అడవి దర్శకత్వంలో సరితా పట్రా నిర్మించిన 'వినాయకుడు' ఎంపికైంది. అవార్డు కింద రజిత నంది, 20వేల నగదు అందజేస్తారు. తృతీయ చిత్రంగా భాస్కర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన 'పరుగు' ఎంపికైంది. దీనికి గాను కాంస్య పతకం, 10వేల నగదు అందిస్తారు. సకుటుంబ కథా చిత్రంగా 'అష్టాచమ్మ' చిత్రానికి అక్కినేని అవార్డు లభించింది. రజిత నంది, 20వేల నగదు అందిస్తారు. రామ్ మోహన్ నిర్మాతగా ఇంద్రగంటి మోహన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఉత్తమ పాపులర్ చిత్రంగా శ్రీనువైట్ల దర్శకత్వంలో స్రవంతి రవికిషోర్ నిర్మించిన 'రెడీ' ఎంపికైంది. దీనికి గాను నిర్మాతకు స్వర్ణనంది, 50 వేల నగదు అందజేస్తారు. ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రంగా నందిరెడ్డి నరసింహారెడ్డి నిర్మించిన '1940లో ఒక గ్రామం' ఎంపికైంది. ఇందుకు గాను స్వర్ణనంది, 50వేల నగదు అందజేస్తారు. ఉత్తమ బాలల చిత్రంగా ఏదీ ఎంపిక కాలేదు. ద్వితీయ ఉత్తమ బాలల చిత్రంగా 'దుర్గి', ద్వితీయ ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా 'మేమూ మనుషులమే', ద్వితీయ ఉత్తమ విద్యా విషయక చిత్రంగా ఆళ్ల రాంబాబు నిర్మించిన 'అడవి నా తల్లిరో' ఎంపికైంది

No comments:

Post a Comment