Saturday, October 10, 2009

ఇవివి మళ్లీ 'గోల'

ప్రముఖ దర్శకుడు ఇవివి సత్యనారాయణ ఇప్పుడు హాప్ సెంచరీ లో పడ్డారు. 'ప్రేమఖైదీ', 'ఆమె', 'అప్పుల అప్పారావు', 'కితకితలు', 'ఎవడిగోల వాడిది' వంటి ఎన్నో సక్సెస్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన 49వ చిత్రం 'బెండు అప్పారావు' ఈనెల 16న విడుదలకు సిద్ధమవుతోంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డాక్టర్ డి.రామానాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం తర్వాత తన 50వ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించేందుకు ఇవివి సన్నాహాలు చేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం ఇవివి దర్శకత్వంలో లార్ స్కో ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై లగడపాడి శ్రీధర్ నిర్మించిన 'ఎవడిగోల వాడిది' చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది.

ఈ సీక్వెల్ లో తొలి వెర్షన్ లో నటించిన ఆర్యన్ రాజేష్ కథానాయకుడుగా నటించబోతున్నారు. ఆయనకు జోడిగా ఓ కొత్తమ్మాయిని పరిచయం చేయనున్నారు. సునీల్, వేణుమాధవ్ కీలక పాత్రలు పోషించనున్నారు. బ్యాంకాక్ లో ఎక్కువ భాగం షూటింగ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి స్క్రిప్టు రెడీ అయిందనీ, దీనిని లగడపాటి శ్రీధర్ నిర్మించే అవకాశాలున్నాయనీ తెలుస్తోంది. అలా కాని పక్షంలో ఇవివి సినిమా పతాకంపై ఇవివి సత్యనారాయణ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఈ చిత్రం ఉంటుంది. ఇవివి సత్యనారాయణ కుమారుల్లో ఒకరైన అల్లరి నరేష్ ఇప్పటికే కామెడీ హీరోగా సెటిల్ కాగా, ఆర్యన్ రాజేష్ ఇటీవల కాలంలో సరైన హిట్లు లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ సీక్వెల్ తో రాజేష్ కు సరైన బ్రేక్ ఇచ్చేందుకు ఇవివి పట్టుదలగా ఉన్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం కానుంది.

No comments:

Post a Comment